మిమ్మల్ని వదలం.. రుణమాఫీ చేయకపోతే.. నిర్భంధిస్తాం


రావాల్సిన పంటనష్ట పరిహారం వెంటనే ఇవ్వాలి

జిల్లా మంత్రులను హెచ్చరించిన రైతు సంఘం నాయకులు

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి




అనంతపురం అర్బన్: పచ్చచొక్కాల జేబులు నింపడానికే అధికార టీడీపీ ప్రభుత్వం 'నీరు-చెట్టు' కార్యక్రమం కింద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. పెద్దిరెడ్డి, అధ్యక్షుడు ఎంకె. వెంకటరెడ్డిలు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో జిల్లా ప్రజలు నమ్మి ఓట్లేసి రెండు పార్లమెంట్, 12 శాసనసభ స్థానాలను బహుమతిగా ఇచ్చారు. అలాంటి రైతులను నిట్టనిలువునా మోసం చేసి అధికారం చలాయిస్తున్న చంద్రబాబు, జిల్లా మంత్రులపై మండిపడ్డారు.





రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు టీడీపీ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,36,532 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం పనిచేయకుండా పచ్చచొక్కాల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ.. ప్రజలకు ఉపయోగం లేని వాటికి కోట్ల రూపాయలను నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. 2015కు సంబంధించి 90 శాతం రాయితీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.



కలెక్టరేట్ ఆవరణంలో తోపులాట

రైతు రుణమాఫీ, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. సప్తగిరి సర్కిల్ నుండి ర్యాలీగా వచ్చిన రైతులు, రైతు సంఘం నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయం గేట్లను తోసుకుని ఆవరణంలోకి వచ్చారు. దీంతో పోలీసులు, రైతు సంఘం నాయకుల మధ్య కలెక్టరేట్ ఆవరణంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top