జూన్‌ 8 నుంచి ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌


జూన్‌ 25న సీట్ల కేటాయింపు..29 నుంచి తరగతులు



సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్‌–2017 కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.



ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించి ర్యాంకుల వారీగా తేదీలను జూన్‌ 1న ప్రకటిస్తామని కన్వీనర్‌ పండాదాస్‌ పేర్కొన్నారు. హెచ్‌టీటీపీఎస్‌:// ఏపీఈఏఎమ్‌సీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌ వెబ్‌సైట్లో ఈ వివరాలను పొందుపరుస్తామని తెలి పారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే ముందే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ధ్రువపత్రాల ఒరిజినల్‌ కాపీలను పరిశీలన కేంద్రాల్లో చూపించి అనంతరం అక్కడి అధికారులకు వాటి జిరాక్సు కాపీలను మాత్రమే అందించాలన్నారు. అలాగే  ప్రవేశం పొందిన తరువాత కాలేజీలకు కూడా ఒరిజినల్‌ ధ్రువపత్రాలను ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం జిరాక్సు కాపీలు మాత్రమే సమర్పించాలని స్పష్టంచేశారు. కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఒరిజినల్‌ ధ్రువపత్రాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులను ఆన్‌లైన్లో చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నామన్నారు.



కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ తేదీలు ఇవీ...

∙ ధ్రువపత్రాల పరిశీలన: జూన్‌ 8 నుంచి 17 వరకు

∙ వెబ్‌ ఆప్షన్ల నమోదు:జూన్‌ 11 నుంచి 20 వరకు

∙ ఆప్షన్లలో మార్పులు:జూన్‌ 21 నుంచి 22 వరకు

∙ సీట్ల అలాట్‌మెంటు: జూన్‌ 25

∙ తరగతుల ప్రారంభం: జూన్‌ 29

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top