రాజధానికి భూమి ఇచ్చిన రైతుల ఆందోళన
గుంటూరు: ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఆందోళనకు దిగారు. నూతన రాజధాని పరిధిలో పలు గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడానికి ఇష్టపడని విషయం తెలిసిందే. తాము భూములు ఇచ్చేదిలేదని వారు తెగేసి చెప్పారు. భూములు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. తాము ఇచ్చిన అంగీకార పత్రాలు తిరిగి ఇచ్చివేయమని డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని ఏపీసీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు.
గతంలో తాము ఇచ్చిన భూమి అంగీకార పత్రాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామని స్థానిక అధికారులు రైతులకు సర్ధి చెప్పారు.