మార్చి 6న ఏపీ బడ్జెట్
మార్చి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2015-16) జీరో స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 6వ తేదీన అసెంబ్లీకి సమర్పించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 2వ తేదీన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసే ప్రసంగంతో ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ మేరకు ఫైలును ఆర్థిక శాఖ అధికారులు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదం తర్వాత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపనున్నారు. కాగా స్టాండింగ్ కమిటీలు లేకుండా 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రూపొందించాలని నిర్ణయించారు.