కుంభిపాకమే కరెక్ట్!

కుంభిపాకమే కరెక్ట్!


ఆ దుర్మార్గులను ఉరితీయండి. కాల్చి చంపడమే సరైన శిక్ష. కుంభిపాకమే(సలసల కాగే నూనెలో వేసి చంపడం) కరెక్ట్. విషనాగులతో కాటేయించి చంపాలి. చెన్నై స్నేక్ పార్కులో వదిలేయాలి. యాసిడ్ పోసి కాటికి పంపాలి. ఇలాంటి వాళ్లను ముందు చంపిన తర్వాతే మాట్లాడాలి... 'స్నేక్ గ్యాంగ్'పై సామాజిక సంబంధాల మాధ్యమంలో వెల్లువెత్తిన ఆగ్రహం ఇది. సభ్యసమాజం తల దించుకునేలా సామూహికంగా ఓ మగువ మానాన్ని మంటగలిపిన మదాంద కామాంధులను నేరుగా కాటికి పంపడమే సరైన శిక్ష ముక్తకంఠంతో నినదిస్తున్నారు జనం.



హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌లో కాబోయే భర్త ఎదుటే ఓ యువతిపై ఏడుగురు రాక్షకులు కీచక పర్వం సాగించారన్న వాస్తవం వెలుగులోకి రావడంతో జనం రగిలిపోతున్నారు. కాలనాగులతో బెదిరించి దుశ్శాసన పర్వానికి ఒడిగట్టిన పరమ దుర్మార్గులు- ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్‌బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్‌ల పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలోనే ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్న నిజం గగుర్పాటు గొల్పుతోంది. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు వీరి ఖాతాలో ఉన్నాయంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది.



చేసిన అకృత్యాలకు సిగ్గుపడడం పోయి సెల్ఫోన్లలో వాటిని చిత్రీకరించడం 'స్నేక్ గ్యాంగ్'కు అలవాటు. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించడం, రౌడీయిజం చేయడం వీరి నైజం. ఎంతోమంది అబలలు వీరి ఆగడాలకు బలైపోయారు. బెదిరింపులకు భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇన్నాళ్లకు వీరి పాపం పండింది. తనకు జరిగిన అవమానాన్ని దిగమించి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పాపాల భైరవులకు సంకెళ్లు పడ్డాయి. చేసిన పాపాలకు కనీస పశ్చాత్తపం కూడా కనబరచని కాలనాగులకు కఠిన శిక్ష వేయాలని యావత్ జనం నినదిస్తున్నారు. రాక్షసానందంతో అత్యాచారకాండ సాగించిన అనకొండాలను అంతం చేయడమే సరైన శాస్తి అంటున్నారు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top