'రాజధాని కోసం 1000 ఎకరాలు సరిపోతుంది'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు ఎందుకని ...1000 ఎకరాలు సరిపోతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రఘువీరారెడ్డి శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర రాజధాని 30వేల ఎకరాల్లో లేదని అన్నారు. 'రాజధాని పేరుతో రైతులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ పాల్పడుతున్నారా?, ఏ చట్టం కింద భూములు సేకరిస్తున్నారు? మీరేమైనా సూపర్ పవరా?. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన టీడీపీ నేతలకు గులాంగిరి చేస్తున్నారు.
30వేల ఎకరాల్లో భూములు సేకరించడానికి మీరేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారా? బ్రోకరా?. పంట భూముల్లో రాజధాని నిర్మాణం వద్దని చెప్పిన శివరామకృష్ణన్ నివేదికను తుంగలో తొక్కారు. అటవీ భూముల్లో రాజధాని నిర్మాణం చేసుకోవచ్చన్న చట్టాన్ని గాలికొదిలేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దం. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవచ్చు. ఇదే విషయంపై సీఎంకు లేఖ రాశా' అంటూ ఆయన తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.