కృష్ణా-గుంటూరు మధ్యే రాజధాని!
కొత్త రాజధానికి కృష్ణా, గుంటూరు మధ్య ప్రాంతమే సరైన స్థలమని తాము శివరామకృష్ణన్ కమిటీ ముందు ప్రస్తావించినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. ఢిల్లీలో కమిటీ సభ్యులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, విమానాశ్రయం, నదీజలాలు, నాలుగు లేన్ల రోడ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 26న కలుస్తారని చెప్పారు. చంద్రబాబుకు ముసాయిదా నివేదికను కమిటీ సమర్పించనుందని తెలిపారు. కొత్త రాజధానికి సుమారు 20 వేల ఎకరాలు అవసరమని, రాబోయే మూడు నెలల్లో ఆ 20 వేల ఎకరాల భూమిని గుర్తిస్తామని తెలిపారు. ఆయా రంగాలలో నిపుణులతోనే కొత్త రాజధాని కోసం కమిటీ ఏర్పాటుచేశామని, మరో సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటుచేస్తున్నామని నారాయణ చెప్పారు.