కాంగ్రెస్‌కు ఆనం బ్రదర్స్ గుడ్‌బై


కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన ఇంట్లో అన్న ఆనం వివేకానంద రెడ్డితో కలిసి తమ మద్దతుదారులతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల మాటలను అధిష్ఠానం పెడచెవిన పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వివరించారు. తాము కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా ఉన్నామని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచే జిల్లాలో తమ రాజకీయ భవిష్యత్తుపై మీడియాలో, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందన్నారు.



ఈ చర్చకు తెరదించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. కార్యకర్తలు తాను ఏ పార్టీలో చేరినా అండగా నిలబడతామని చెప్పడం సంతోషకరమని రామనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా పార్టీలో చేరాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల గ్రాఫ్ ఇప్పుడు మరింత దిగజారిపోయిందని తెలిపారు. తమను నమ్ముకున్న ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే బలమైన పార్టీలో చేరడం తప్పదని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని తెలిపారు. టీడీపీలో చేరే తేదీలను మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top