చంద్రబాబును కలిసిన అమిత్ షా
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు ...తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ...బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చిన అమిత్ షాను సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అమిత్షా వచ్చారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో అద్భుత విజయంతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, కానీ వచ్చే దఫా మాత్రం దక్షిణం, తూర్పు ప్రాంతాల్లో అఖండ విజయంతో అధికారంలోకి రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందులో తెలంగాణ పాత్ర కీలకంగా ఉండాలని, బీజేపీకి కంచుకోట కావాలని తన లాంటి పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.