జగన్ ప్రధానిని కలిస్తే మీకు బాధేంటి?
ముఖ్యమంత్రిపై అంబటి ధ్వజం
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి చర్చిస్తే సీఎం చంద్రబాబుకు బాధేంటని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరినందుకా ? మిర్చి రైతులను ఆదుకోవాలని విన్నవించినందుకా? రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలని అడిగినందుకా? అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్నందుకా? అని నిప్పులు చెరిగారు.
శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్.. ప్రధానిని ఇదివరకే అపాయింట్మెంట్ అడిగిన విషయం తెలిసిందేనన్నారు. అప్పట్లో వీలుకాక పోవడంతో ఇటీవల అపాయింట్మెంట్ కోరారని, ఆ మేరకు పీఎంవో నుంచి మంగళవారం రాత్రి అనుమతి రాగానే ఢిల్లీ వెళ్లారన్నారు.