పోలీసులను టీడీపీ గూండా వ్యవస్థగా మార్చారు


* వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి

* ప్రభుత్వ కుట్రలను ఎండగట్టండి

* దిశానిర్దేశం చేసిన వైఎస్సార్ సీపీ నేతలు

 రామచంద్రపురం: రాష్ట్రంలో పోలీసులను టీడీపీ గూండా వ్యవస్థగా మార్చేశారని, చంద్రబాబునాయుడు పాలనను అంతమొందించేందుకు ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో పార్టీ పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది.



ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల వద్ద ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించి ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోసు మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచేశాడన్నారు.



అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. రాష్ట్రంలో దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. తాను పార్టీ మారిపోతున్నానంటూ అధికారపారీవారు దుష్ర్పచారం చేశారని రంపచోడవ రం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. తాను పార్టీ మారితే  పదవులు, రూ.కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు.



చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్న తీరును ఇంటిటికీ వెళ్లి ప్రజలకు తెలిపి వారి మద్దతు కూడగట్టాలని మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ప్రసంగం కార్యకర్తలను ఉర్రూతలూగించింది. రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ సెల్, వైద్య విభాగం అధ్యక్షులు పెట్టా శ్రీనివాసరావు, యనమదల మురళీకృష్ణ, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ప్రసంగించారు.



రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా,  రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, మండపేట, రాజమండ్రి నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు  వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, ఆకుల వీర్రాజు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి మానే దొరబాబు, నాయకులు శిరిపురపు శ్రీనివాసరావు, సుంకర చిన్ని, కుడుపూడి బాబు, గిరిజాల బాబు, మైనార్టీ సెల్ నాయకులు నయీంభాయ్, యనమదల గీత తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top