బాబు వచ్చినా జాబు రాలేదు..
కర్నూలు(రాజ్విహార్) : ‘బాబు వస్తే జాబు వస్తుందని’ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యువతకు మరోసారి మోసం చేశారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎ. అయ్యస్వామి ఆరోపించారు. ఆదివారం స్థానిక సప్తగిరి నగర్లోని చండ్ర రాజేశ్వర రావు భవన్లో ఆ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కారుమంచి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దాహంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాననే హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఆచరణకు చర్యలు తీసుకోలేదన్నారు.
నిరుద్యోగ భృతిపై ఎన్నో హామీలు ఇచ్చిన ఆయన దీనిపై మౌనంగా ఉండడం దృరదృష్టకరమని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను రెగ్యులర్ చేయపోగా గడువు ముగిందనే కారణాలు చూపి ఇంటికి పంపడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి లెనిన్బాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని ..వాటిల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు రవిమోహన్, నాగ రాముడు, సంజయ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం పాల్గొన్నారు.