అగ్రి గోల్డ్ చైర్మన్, ఎండీలకు అస్వస్థత
ఏలూరు అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించి.. ఎగవేశారనే అభియోగాలపై అరెస్టయిన అగ్రి గోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషుకుమార్ (నారాయణరావు) అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
సోమవారం వారు అస్వస్థతకు గురవ్వడంతో జైలు సిబ్బంది వెంటనే ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా జైలు వర్గాలు తెలిపాయి.