విష ప్రచారానికి స్వస్తి పలకాలి

విష ప్రచారానికి స్వస్తి పలకాలి


సాక్షి, కడప :

 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో స్వయాన అధ్యక్షుడే కార్యకర్తలపై దాడికి దిగబడే సంసృ్కతి కొనససాగడం.....కుర్చీలతో సమావేశాల్లో కొట్టుకోవడం లాంటి సంఘటనలు కొదవ లేదని...కానీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ  కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని....అలాంటి వైఎస్సార్ జిల్లాలో ఉన్న నాయకులపై టీడీపీ, కొన్ని పత్రికలు పనిగట్టుకుని విష ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు.



శుక్రవారం రాత్రి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే  రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే సమావేశానికి రాలేదని కొందరి పేర్లను ఎత్తి చూపుతూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించడం దురదృష్టకరమన్నారు.



ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేక పోతున్నానని...మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా గొంతులో సమస్య ఏర్పడిందని ముందే చెప్పినట్లు అమర్ వెల్లడించారు. అంతేకాకుండా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అమెరికాలో ఉన్న ఫలితంగా రాలేకపోయారని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సౌత్ ఆఫ్రికాకు వెళ్లారని, ఈ నేపధ్యంలోనే రాలేదని అమర్‌నాథ్‌రెడ్డి వివరించారు. చిత్తూరులో కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని మిథున్‌రెడ్డికి సంబంధించిన కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీడియాకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.



పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగినా పార్టీ మారుతున్నట్లు దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేవలం మైండ్ గేమ్ ఆడుతూ....పార్టీని దెబ్బతీయడానికి కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు వరుస కట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో అక్కడ టీడీపీ ఖాళీ అవుతోందని ఆయన జోస్యం చెప్పారు., ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి, అల్లుడు జయసింహారెడ్డిలు సమావేశానికి హాజరైనా ఆ మీడియాకు ఎందుకు కనబడలేదని ఆయన ప్రశ్నించారు.



అలాగే రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు వారివారి నియోజకవర్గాల్లో అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ముందుగానే ఆలస్యంగా వస్తామని సమాచారం ఇచ్చారని, ఇంతలోపే టీవీలలో స్కోరింగ్‌లు పెట్టి దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



  వైఎస్ జగన్ దయవల్లే పదవి....జీవితాంతం రుణపడి ఉంటా! : జెడ్పీ చైర్మన్

 వైఎస్సార్‌జిల్లాలో ఎవ్వరికీ తెలియని తనను ఈరోజు జిల్లాలో ప్రథమ పౌరుడిగా నిలబెట్టి...జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి పదవిని కట్టబెట్టి హోదా కల్పించిన అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి స్పష్టం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసేందుకు కొన్ని పత్రికలు, నాయకులు అదే పనిగా పనిచేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సమావేశానికి రాలేక పోతున్నానని ముందే అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పినట్లు గూడూరు రవి తెలియజేశారు.



జీవితాంతం వైఎస్ కుటుంబం వెంటే తన రాజకీయప్రయాణమని, వార్తను రాసేముందు యాజమాన్యాలు ఆలోచించి ప్రచురించాలని సూచించారు. భారీ వర్షాల రాకతో పంటను విత్తుతున్నానని, అయితే మీడియా చేసిన దుష్ర్పచారంతోనే విత్తనాన్ని సైతం వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీని వదిలిపెట్టి వలస పోతున్నట్లు పత్రికల్లో రాయడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.

 

 అమెరికాలో రఘురామిరెడ్డి :

 కుమారుడు నాగిరెడ్డి


 మైదుకూరు ఎమ్మెల్యే, తండ్రి అయిన రఘురామిరెడ్డి అమెరికాకు వెళ్లారని, అందువల్ల సమావేశానికి రాలేక పోయినట్లు కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదని మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్‌జగన్ నాయకత్వంపై పూర్తి స్థాయి నమ్మకముందని, ఎప్పుడూ కూడా వైఎస్ కుటుంబం వెంటే నడుస్తానని ఆయన వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, ఏదైనా రాసేముందు ఒకసారి వివరణ తీసుకుంటే బాగుంటుందని ఆయన వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top