ప్రమాదాల నివారణకు చర్యలు
శ్రీకాకుళం సిటీ: రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీకాకుళం సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్సైలు, ఏఎస్ఐలు, రైటర్లతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు రహదారి ప్రమాదాల నివారణపై సదస్సు జరిగిందన్నారు. ఇనేటివ్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక మెబైల్ అప్లికేషన్ను రూపొందించిందని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను, ముఖ్యసూచనలను ఎస్పీ వివరించారు.
సుదీర్ఘ రహదారితో ప్రమాదాలు
రాష్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 173 కిలోమీటర్ల జాతీయ హదారి ఉందన్నారు. దీంతో దీనిపై ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 76 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ప్రమాదాల నివారణకు ఎన్హెచ్ అధికారులు, రవాణాశాఖ అధికారుల సహకారం అవసరం అన్నారు.
ప్రమాదాలు జరిగితే పోలీసులు వెళ్లాల్సిందే
రహదారి ప్రమాదాలు జరిగితే సంబంధిత ప్రదేశాలకు సీఐలు, ఎస్ఐలు వెళ్లి అక్కడ నుంచి నేరస్థలం, నేరం చేసిన వాహనాలు, వాటి ఫొటోలను తీయాలని ఎస్పీ ఆదేశించారు. అక్కడ నుంచే రోడ్సేఫ్టీ ప్రోగ్రాం ఆప్లికేషన్లో ఆ ఫొటోలను అప్లోడ్ చేయాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు, ట్రాఫిక్ నిలిచే సందర్భాలు ఉంటే వాటి వివరాలు కూడా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి సీహెచ్ పెంటారావు, డీఎస్పీలు కె. భార్గవరావునాయుడు, సీహెచ్ వివేకానంద, వేణుగోపాలరావునాయుడు, వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.