ఆరోగ్యశాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు
విశాఖపట్నం : విశాఖలోని ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ చంద్రలేఖ అనే నర్సు కొన్ని రోజులుగా కార్యాలయంలోని సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఆమెకు బిల్లులు మంజూరు కావాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ వెంకటరావు డిమాండ్ చేశారు.
దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. వారి సూచన మేరకు మంగళవారం కార్యాలయంలో చంద్రలేఖ లంచం డబ్బు ఇస్తుండగా వెంకటరావును, అతనికి సహకరించిన క్లర్క్ కె.నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.