ప్రత్యేక హోదా కోసం రోజంతా సెల్‌టవర్‌పైనే


పెద్దకాకాని (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం గుంటూరులో ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కిన వ్యక్తి కిందకు దిగకుండా తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు. వివరాల ప్రకారం.. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న మైక్రోవేవ్ బిల్డింగ్ వెనుక ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు.  పోలీసులు అతడ్ని కిందకు దించేందుకు రాత్రి వరకూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.



 రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే... అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం ఉదయం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. ఒకవేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు వలలతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కాగా అతడిని కిందకు దించేందుకు పోలీసులు ఆదివారం కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top