ప్రియుడితో కలసి కూతురిపై హత్యాయత్నం
రాజమండ్రి క్రైం(తూర్పుగోదావరి): ఓ మహిళ భర్త నుంచి విడిపోయి మరొకరితో సహజీవనం చేస్తోంది. కొడుకు, కూతురిని భారంగా భావించి గుట్టుచప్పుడు కాకుండా కుమారుడిని ఎవరికో అమ్మేసింది. తన వ్యవహారానికి అడ్డుగా ఉంటోందని భావించి కూతురిని చిత్రహింసలు పెడుతోంది. చివరికి చిన్నారిని చంపేందుకు యత్నించింది. ఈ ఘోరం రాజమండ్రి నగరంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలివీ...నగరంలోని చింతలనామవరం ప్రాంతానికి చెందిన మీనాక్షిని ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త వదిలేశాడు.
మీనాక్షి కొంతకాలం నుంచి అప్పల్రెడ్డి అనే తాపీమేస్త్రీతో కలసి సుబ్బారావు నగర్లో ఉంటోంది. ఇద్దరు సంతానంలో కొడుకును గుట్టుచప్పుడు కాకుండా ఎవరికో విక్రయించేసింది. కుమార్తె భవ్యశ్రీ(4)ను ప్రియుడితో కలసి రోజూ చిత్రహింసలు పెడుతోంది. శుక్రవారం రాత్రి చిన్నారి కళ్లలో కారం చల్లి, విపరీతంగా కొట్టారు. దీంతో తీవ్ర బాధతో భవ్యశ్రీ కేకలు పెట్టింది. ఇది విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని వారిని ఇదేమని నిలదీశారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని అప్పల్రెడ్డిని, మీనాక్షిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.