‘భార్య లేని జీవితం నాకొద్దు.. చావడం మేలు’
మదనపల్లె: మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని బెంగళూరు రోడ్డు నక్కల దిన్నె తండాలో ఈ సంఘటన జరిగింది. తిప్పన్న నాయక్(30) అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని పలుమార్లు కోరినా ఆమె రాలేదు.
దాంతో మనస్తాపం చెందిన అతను చనిపోవాలని నిర్ణయించుకుని సోమవారం స్థానిక మల్లికార్జున సర్కిల్ వద్దకు చేరుకుని అక్కడ ఓ మద్యం దుకాణంలో మద్యం తాగి రోడ్డుపైకి చేరాడు. ‘భార్య లేని జీవితం వద్దు.. తన తప్పులేకున్నా ఒంటరిని చేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నా కాపురానికి రావడం లేదు.. పిల్లల్ని చూడకుండా ఉండలేను.. ఒంటరిగా బతికే కంటే చావడమే మేలు’ అని అందరూ చూస్తుండగానే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన ట్రాఫిక్, బ్లూకోట్ పోలీసులు అతడిని అడ్డుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.