ఏసీబీకి చిక్కిన ఏసీటీఓ


రాజమండ్రి క్రైం: బేకరీ నిర్మాణానికి అనుమతి కోసం అభ్యర్ధిస్తున్న వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ కమర్షియల్ టాక్స్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో గురువారం చోటుచేసుకుంది. వివారాలు.. గ్రామానికి చెందిన నకల సురేష్ బేకరీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్యాపురం సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రసజ్ఞ శ్రీ బేకరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.


దీంతో సురేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు రసజ్ఞ శ్రీ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనికి సహకరించింన జూనియర్ అసిస్టెంట్ రామ్మోహనరావును కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top