అంతర్ జిల్లా గొలుసు దొంగలు అరెస్టు

అంతర్ జిల్లా గొలుసు దొంగలు అరెస్టు - Sakshi


కడప అర్బన్:

 కడప నగరంలో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లే ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.5 లక్షలు విలువ చేసే 24 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి వివరాలను వెల్లడించారు.



కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం వైశ్య బజారుకు చెందిన చంద్రకాయల సుదర్శన్ (26), చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన  షేక్ మగ్బూల్ బాషా అలియాస్ మున్నా(26) గత కొద్దికాలంగా కడప నగరంలో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్‌బైక్‌పై వచ్చి వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లేవారు.



సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓంశాంతి నగరంలో ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా చిన్నచౌక్ సీఐ యుగంధర్‌బాబు, ఎస్‌ఐ హేమకుమార్ తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వీరినుంచి మోటార్ సైకిల్, రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారు బస చేసిన లక్ష్మిప్రియ లాడ్జిలో కూడా సోదాలు నిర్వహించి బ్యాగులో దాచి ఉంచిన బంగారు గొలుసులను రికవరీ చేశారు. వీరితో పాటు నంద్యాలకు చెందిన మంచాల శివప్రసాద్ కూడా నేరాలకు పాల్పడేవాడని, అతన్ని గతంలోనే అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. గొలుసు దొంగలను అరెస్టు చేసేందుకు కృషి చేసిన సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ సుధాకర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top