లారీ బోల్తా : 8 మందికి తీవ్ర గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి సమీపంలోని రహదారిపై ఇనుప చువ్వలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఆ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.