ప్రజా సహకారంతోనే ప్రగతి
♦ 71వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పితాని సత్యనారాయణ
♦ వైభవంగా పంద్రాగస్టు వేడుకలు
♦ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా సంపూర్ణ ప్రగతికి ప్రజల సహకారం అవసరమని, స్వాతంత్య్ర ఫలితాలు అందరికీ అందాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖామాత్యులు, జిల్లా ఇన్చార్జి మం త్రి పితాని సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జరిగిన 71వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ ప తాకాన్ని ఎగుర వేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
వ్యవసాయానికి పెద్ద పీట
స్వాతంత్య్ర యోధుల ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37,201 క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై రైతులకు అందించామని చెప్పారు. సేద్యంలో కలుపు నివారణ కోసం రూ.3.89 కోట్ల విలువైన మందులు సరఫరా చేశామన్నారు. సాగులో యాం త్రీకరణను ప్రోత్సహిస్తూ 50, 70 శాతం రాయితీతో యంత్రాలు అందిస్తున్నామని చెప్పారు. రైతురథం పేరిట ట్రాక్టర్లు అందజేస్తున్నామన్నారు. రైతులందరికీ ఖరీఫ్ రుణాలు, కౌలు చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యానవనం, సూక్ష్మనీటి పారుదల ప్రాజెక్టులు, అనుబంధ రంగాలైన పాడి పశువులు, ప్రకృతి వ్యవసాయం, గోశాలల నిర్వహణ, మనకోడి పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నామన్నారు. వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీకి రూ.421కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నాగావళిపై వరద కాలువల నిర్మాణానికి రూ.1055 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు రూ.19.82కోట్లు అంచనా వేయడం జరిగిందని, పైపులైన్ల అభివృద్ధికి రూ.11.56 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.
ఉపాధి కల్పన
ఉపాధి హమీ పథకం ప్రతిష్టాత్మకంగా నడుస్తోందని, ఇప్పటి వరకు 321.64 కోట్లు ఖర్చు చేశామని, 3.43 లక్షల కుటుంబాలకు పని కల్పించామని వివరించారు. ఉపాధి క ల్పనలో రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. వనం మనం కార్యక్రమంలో 60 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగులకు, బీసీ విద్యార్థుల ఉపకార వేతనాల మంజూరు, వివిధ కార్పొరేషన్ రాయితీ రుణాలు, గిరి పుత్రులకు ప్రత్యేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి çపసుపుకుంకాలు, స్త్రీ నిధి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆయా కులాల ఉప ప్రణాళిక కింద సాయం చేస్తున్నామని తెలిపారు.చేనేత అభివృద్ధికి ప్రత్యేక నిధులు రూ.10కోట్లు కేటాయించి 19 క్లస్టర్ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. యువ సంక్షేమంలో భాగంగా జాబ్ మేళా నిర్వహణ, ఉద్యో గ ఉపాధి కార్యక్రమాలు, శిక్షణలు అందజేస్తామన్నారు. చంద్రన్న బీమా, సామాజిక భద్రతా పింఛన్ల ద్వారా మహిళలను, పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు.
విద్యకు పెద్దపీట వేస్తూ జిల్లాలో ట్రిపుల్ ఐటీ నిర్మాణం కోసం 200 ఎకరాలు కేటాయించామని, ఈ ఏడాది నుంచి తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్టీఆర్ వైద్యసేవ, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్తో పాటు ఆస్పత్రులు అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మీజిల్స్, రుబెల్లా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. కిడ్నీ వ్యా«ధిగ్రస్తుల నుంచి ప్రత్యేక వైద్య బృందాల ద్వారా రక్త నమూనా సేకరించడం జరిగిందన్నారు. ఈ వ్యాధి తీవ్రత ఉన్న వారికి డయాలసిస్తోపాటు పింఛన్లు కూడా అందజేయనున్నామని తెలిపారు. రిమ్స్లో నెఫ్రాలజీ యూనిట్ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్దానం ప్రాంతంలో శుద్ధ జలాలను అందించేందుకు రూ.16కోట్లతో 7 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
స్వచ్ఛ భారత్లో భాగంగా 2018 అక్టోబరు నాటికి ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేందుకు లక్ష్యంగా తీసుకున్నామని, ఇప్పటికే 15 పంచాయతీల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 22 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, టెక్కలిలో రూ.25.25కోట్లతో 24 గ్రామాలకు తాగునీటిని అందించే పథకం ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ.11కోట్లతో తాగునీటి పథకాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ గూడు కార్యక్రమంలో హుద్హుద్ బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి చేశామని, దీని కోసం ఇంటింటా సర్వే నిర్వహించి అందరికీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తున్నామన్నారు. సివిల్ సప్లై ద్వారా జిల్లాలో 12 కొత్తగా గోదాంలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు పాలనను అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రైతుబజారుల ఆధునికీకరణ, పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా జిల్లాకు 16 భారీ పరిశ్రమలు రానున్నాయన్నారు.
విద్యుద్దీకరణలో భాగంగా ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, దేవాలయాలు, అరసవల్లి, శ్రీముఖలింగం, కళింగపట్నం తదితర ప్రాంతాలను కలుపుతూ పర్యాటక అభివృద్ధి చేయనున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలో అమృత్ పథకం ద్వారా కాలువలు, సీసీ రోడ్లు, ఏర్పాటు చేస్తున్నామని, నగరానికి రింగురోడ్డు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. తలసరి ఆదాయం పెంచేందుకు జిల్లాను ప్రథ మస్థానంలో నిలిపేందుకు ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతక ముందు ఎన్సీసీ క్యాడెట్లు మాక్ డ్రిల్ నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, జిల్లా ప్రధాన న్యామూర్తి వీబీ నిర్మలాగీతాంబ, కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతారావు, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ షేక్ షరీన్ చేగం, రెవెన్యూ డివిజినల్ ఆధికారి బదివాడ దయానిధి, జిల్లా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సైడ్లైట్స్
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోడి రా మ్మూర్తి స్టేడియంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.
∙ప్రసంగం చాలా ఎక్కువగా ఉండడంతో సమయం బాగా పెరిగింది. దీంతో అక్కడకు వచ్చిన అధికారులు, విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడ్డారు.
మంత్రి పితాని సత్యనారాయణ పెద్ద ప్రసంగాన్ని చదివేందుకు ఇబ్బంది పడ్డారు. రంజాన్ తోఫా అనే పదాన్ని రంజాన్ తుఫాన్ అని చదువుతూ తడబడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారు నివ్వెరపోయారు.
గతంలో కంటే సాంస్కృతిక కార్యక్రమాలు పెరిగాయి. ముందుగా ఎనిమిది పాఠశాలలు నిర్ణయించి, పది పాఠశాలలకు పెంచారు. దీంతో ఈ కార్యక్రమం చాలా ఎక్కువ సేపు జరిగింది.
కోడి రామ్మూర్తి మైదానంలో సరిపడినన్ని టెంట్లు వేయలేదు. దీంతో ఎండలకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తాగునీటిని గతంలో నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసేవారు. ఈ సారి వారు తగినంత స్థాయిలో తాగునీటిని ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది కలిగింది.
విద్యార్థులు మండుటెండలో సుమారుగా మూడు గంటలు కూర్చోవాల్సి వచ్చింది.
అవార్డు గ్రహీతలకు అందజేయాల్సిన ప్రశంసా పత్రాలు ఒకరివి మరొకరికి అందజేశారు.