డెంగ్యూతో ఏడేళ్ల చిన్నారి మృతి
వీరపనాయునిపల్లె (వైఎస్సార్ జిల్లా) : డెంగ్యూ వ్యాధితో ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కర్నూలులోని రెయిన్బో ఆస్పత్రిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా వీరపనాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రామాంజనేయులుకు మౌనిక(7) సంతానం. కాగా మౌనిక గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ పొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది.
అయితే జ్వరం తగ్గకపోవడంతో అక్కడి నుంచి ఆదివారం కర్నూలులోని రెయిన్బో ఆస్పత్రికి బాలికను తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక సోమవారం మృతి చెందింది. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రామాంజనేయులు కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.