వైఎస్ ఐదో వర్ధంతి నేడు

వైఎస్ ఐదో వర్ధంతి నేడు - Sakshi


భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులు

ఇడుపులపాయలో నివాళులర్పించనున్న వైఎస్ జగన్

 

 సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెంది సెప్టెంబర్ 2వ తేదీకి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఆయన ఐదో వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు, ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే కాక, దేశం మొత్తం మీద సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేసిన వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు వైఎస్ వర్ధంతి రోజున చేపట్టాలని వైఎస్సార్ సీపీ ఇప్పటికే పిలుపునిచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా రక్తదాన శిబిరంతో పాటుగా పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

 

 ఇడుపులపాయకు జగన్: వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం శాసనసభా కార్యక్రమాలకు హాజరైన జగన్ రాత్రి రైలులో బయలుదేరారు. తన తండ్రి సమాధి వద్ద జరిగే సంస్మరణ కార్యక్రమంలో జగన్, కుటుంబసభ్యులు పాల్గొంటారు. ఆయన బుధవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top