శీనయ్యకు 44కోట్ల నామినేషన్‌ నజరానా!


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను పట్టుబట్టి రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకోవడంలో దాగిన రహస్యం మరోమారు బట్టబయలయ్యింది. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పనుల్లో ఏడో ప్యాకేజీ కింద రూ.27.56 కోట్ల విలువైన పనులను 2015లో బొల్లినేని శీనయ్య కంపెనీ(ప్రాజెక్ట్స్‌) లిమిటెడ్‌(బీఎస్‌సీపీఎల్‌)కు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన సర్కార్‌.. తాజాగా మరో రూ.44.06 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెడుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్‌సీపీఎల్‌ అధినేత అయిన బొల్లినేని శీనయ్య సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడన్న సంగతి తెల్సిందే.



పోలవరం కుడి కాలువలో ఏడో ప్యాకేజీ(156.50 కిమీ నుంచి 174 కిమీ వరకూ) పనులను రూ.180.70 కోట్లకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేజిక్కించుకుంది. ఈ పనుల్లో 163.20 కిమీ నుంచి 164.75 కిమీ వరకూ  1.55 కిమీ మినహా మిగతా కాలువ తవ్వకం పనులను లైనింగ్‌తో సహా 2009 నాటికే పూర్తి చేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎల్‌ అండ్‌ టీ సంస్థపై వేటు వేసిన ప్రభుత్వం మిగిలిన 1.55 కిమీ కాలువ తవ్వకం పనులను రూ.27.56 కోట్లుగా లెక్క గట్టి నామినేషన్‌ పద్ధతిలో బీఎస్‌సీపీఎల్‌ సంస్థకు కట్టబెట్టింది. అంతటితో ఆగకుండా.. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ పద్ధతిలో కాలువ తవ్వారనే సాకు చూపి రూ.3.55 కోట్లను అదనంగా ఈనెల 9న ఇచ్చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top