20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ

20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ - Sakshi


ఆ తర్వాత యథేచ్ఛగా విక్రయంఆపైన చెరువుల తవ్వకానికి శ్రీకారం కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ



మచిలీపట్నం
: బందరు మండలంలో అధికార పార్టీ నాయకుల కబ్జా పరంపర కొనసాగుతూనే ఉంది. కరగ్రహారం పంచాయతీ పరిధిలో క్యాంప్‌బెల్‌పేట సమీపంలో 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఏడెనిమిది సంవత్సరాల కిందట ఈ భూమిలో ఉప్పు పండించేవారు. కాలక్రమంలో ఉప్పు పండించడాన్ని నిలిపివేయడంతో ఖాళీగా ఉంటోంది. దీనిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి తనదేనని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. 15 రోజుల క్రితం ఈ భూమిని ఎకరం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు కరగ్రహారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి, ఆ తర్వాత మరో ఇద్దరికి విక్రయించేశాడు. ఈ భూమిని చెరువుగా తవ్వుకునేందుకు తాను అండదండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఈ భూమిని రొయ్యల చెరువుగా మార్చేందుకు మార్కింగ్ ఇచ్చారు.



ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించి చెరువులుగా తవ్వేందుకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో సర్వే నంబరు 248లో ఈ భూమిని కూడా చేర్చారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటమే కాక విక్రయించి చెరువులుగా తవ్వేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించారని, దీన్ని అడ్డుకుంటామని క్యాంప్‌బెల్‌పేట మత్స్యకారులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో ప్రజాప్రతినిధి ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానికి చెందినదని పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులోనూ ఉంచారని

 గ్రామస్తులు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top