16 నామినేషన్లూ ఓకే
ఏలూరు/కాకినాడ సిటీ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన 16 నామినేషన్లూ ఆమోదం పొందాయి. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాలులో ఎన్నికల అధికారి, కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరఫున దాఖలైన రెండు నామినేషన్లు, స్వతంత్రులుగా వేసిన 14 నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని
ఆమోదించినట్టు కలెక్టర్ చెప్పారు.
అయితేన ఓటర్లను గందరగోళ పర్చే ఉద్దేశంతో తనపేరు గల మరో వ్యక్తి నామినేషన్ వేశారని టీడీపీ తరఫున పోటీలో ఉన్న కేవీవీ చైతన్యరాజు అభ్యంతరం తెలిపారు. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కాగా దీనిపై కలెక్టర్ ఎన్నికల కమిషన్ను ఫోన్లో సంప్రదించి, స్పష్టత కోరారు. అభ్యర్థి నామినేషన్లో ఇచ్చిన విధంగానే బ్యాలెట్ పత్రం లోనూ పేరు ప్రచురించాలని అధికారులు సూచించారు.
నామినేషన్లు వేసింది వీరే
టీడీపీ నుంచి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), కలిదిండి శశికిరణ్వర్మ నామినేషన్లు వేశారు. ఏలూరు నగరానికి చెందిన రాము సూర్యారావు (ఆర్ఎస్ఆర్), డాక్టర్ పరుచూరి కృష్ణారావు, కాండ్రేగుల నరసింహం, పి.కృష్ణారావు, గెడ్డం సంపదరావు, పతివాడ కృష్ణారావు, పాత్రుని కృష్ణారావు, పిల్లి డేవిడ్కుమార్, పేపకాయల (శుభ) రాజేంద్ర, ప్రగడ కృష్ణారావు, మాకిదేవీ ప్రసాద్, మురళీధర్ సుంకవల్లి, కేవీవీ సత్యనారాయణరాజు (శ్రీచైతన్యరాజు), సుందర గంగాధర్ స్వతంత్రు లుగా నామినేషన్లు వేశారు.