‘తెల్ల’బోవాల్సిందే


ఒంగోలు: ఆధార్ అనుసంధానంతో బోగస్ తెల్లకార్డుల గుట్టు రట్టవుతోంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు 13.44 శాతం (3,83,150 మంది) పేర్లను తెల్లకార్డుల జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఇప్పటికీ 1.69 లక్షల మందికి ఆధార్ కార్డులు అందకపోగా, 1.58 లక్షల మంది ఇంకా ఆధార్ తీయించుకోకపోవడం గమనార్హం.  

 

తొలగించిన పేర్లు 3.83 లక్షలు

జిల్లాలో మొత్తం 8,87,636 రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల్లో పొందుపరిచిన పేర్లను కలుపుకుంటే 30,23,263 మంది రేషన్ లబ్ధి పొందుతున్నారు. వీరందరి ఆధార్ నంబర్లను రేషన్‌కార్డులకు అనుసంధానించాల్సి ఉంది. అధికారులు పలుమార్లు గడువు పొడిగించినా గత ఈ నెల 10 తేదీ నాటికి 8,27,276 కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. వీటిలో మొత్తం 28,51,360 మంది సభ్యులుండగా వారిలో 20,57,178 మంది ఆధార్ నంబర్లు అందజేశారు.



1,69,496 మందికి ఆధార్ కార్డులు అందలేదు. అయితే వీరు ఆధార్ తీయించుకున్నట్లు రశీదులుండటంతో  అర్హులుగా అధికారులు గుర్తించారు. మొత్తం మీద 22,26,674 మందిని అర్హులుగా తేల్చారు. 3,83,150 మంది పేర్లను అనర్హులుగా గుర్తించి కార్డుదారుల జాబితా నుంచి తొలగించారు. 1,58,009 మంది ఆధార్ తీయించుకోలేదు. 83,527 మంది కార్డులు ఆధార్‌తో అనుసంధానమైనా ఇంకా నిర్ధారణ కాలేదు.   

 

ఇదీ ప్రాతిపదిక

కార్డుల్లో పేరున్నప్పటికీ వివాహమై ఇతర కుటుంబాల్లో సభ్యులుగా చేరడం, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ రేషన్‌కార్డులున్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. కొందరు తమ స్వగ్రామంతో పాటు, నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కూడా రేషన్‌కార్డులు కలిగి ఉంటే..ఆధార్ సీడింగ్ సమయంలో స్పష్టమవుతుంది. కార్డుదారుడు రెండు చోట్ల ఒకే ఆధార్ నంబర్ ఇస్తుండటంతో రెండు చోట్లా కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒక్కొక్కరి పేరుతో మూడేసి కార్డులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటువంటి వారి జాబితాను కూడా అధికారులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ముందు ఆధార్ సీడింగ్ పూర్తయితే అనర్హతకు గురైన సభ్యుల వివరాల గుట్టు విప్పేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.  

 

కిరోసిన్‌పై భారీగా మిగులు:

ఇదిలా ఉంటే మరో వైపు ఇప్పటికే 86 శాతం గ్యాస్ కనెక్షన్లకు ఆధార్‌సీడింగ్ పూర్తయింది. ఇంకా 14 శాతం కనెక్షన్లకు సీడింగ్ పూర్తి కావాల్సి ఉంది. ప్రతి తెల్లకార్డుకు పౌరసరఫరాల శాఖ నీలి కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నా.. ఈ మొత్తం కార్డుదారులకు అందడం లేదనేది బహిరంగ రహస్యం. దానికితోడు గ్యాస్ ఉన్నవారికి కిరోసిన్ సరఫరాలో కోత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పంపిణీ చేసే కిరోసిన్ కన్నా సెప్టెంబర్ నెలకు దాదాపు 15 శాతం కోత విధించారు. అయితే గ్యాస్, రేషన్ కార్డులను రెండింటినీ ఆధార్‌తో అనుసంధానం చేస్తే  ఇక నుంచి ప్రతి నెలా పంపిణీ దాదాపు 60 శాతానికే పరిమితమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top