12 గంటల్లో శివాలయ నిర్మాణం
నంద్యాల: శివాలయాన్ని 12గంటల సమయంలో నిర్మించి ఆళ్లగడ్డ శిల్పులు మరో అరుదైన రికార్డును నెలకొల్పారు. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని అమరయోగ వికాస కేంద్రం ఆవరణలో బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఆలయ నిర్మాణం ప్రారంభించి సాయంత్రం 4గంటలకు పూర్తి చేశారు. అమరయోగ వికాస కేంద్ర నిర్వాహకుడు పాములేటి నిర్మాణాన్ని చేపట్టారు. ముందుగా 24గంటల్లో శివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
అయితే కూలీలు ఉత్సాహంగా పని చేయడంతో పాటు క్రేన్ సహాయం కూడా లభించడంతో 12గంటలు ముందుగానే నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత ఐదారుగంటలు ఆలయ శిల్ప సంపదను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగించారు. 12 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తుతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గోపుర నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది.
ఆలయ ప్రత్యేకతలు ఇవి..
నంద్యాల పట్టణానికి ఈశాన్యంలో శివాలయం నిర్మించడం నంద్యాలకు ఎంతో మంచిదని వేదపండితులు పేర్కొంటున్నారు.
స్ఫటికంతో లింగాన్ని తయారు చేసి శివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం సూర్య కిరణాలు ఈ లింగంపై పడే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దినట్లు శిల్పి అన్నయ్యచారి తెలిపారు.
ఆలయం నిర్మాణం కోసం రూ.20లక్షలు వ్యయం కాగలదని అంచనా వేశారు. ఇందులో కొంత మొత్తాన్ని ఏలూరులోని గోల్డ్ టెంపుల్ నిర్వాహకులు భరించడానికి ముందుకు వచ్చారు. స్థానిక మరో భక్తుడు ధ్వజ స్తంభం ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు పాములేటి తెలిపారు. అలాగే హౌసింగ్ బోర్డుకుచెందిన శంకర్రెడ్డి అనే శివభక్తుడు రూ.లక్ష విరాళాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక ప్రజలు ప్రేమించే గోవు మృతి చెందడంతో దానికి సమాధిని నిర్మించారు. అలాగే అమరయోగ వికాస కేంద్రంలో తిరిగే వానరం కూడా శివరాత్రికి ముందు వికాస కేంద్రంలోని శివలింగం దగ్గర మృతి చెందింది. దీనికి కూడా గో సమాధి పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆంజనేయ, గోమాత విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యోగా నిర్వాహకుడు పాములేటి తెలిపారు.