పీజీ ఎంట్రన్స్ స్కామ్‌లో మరో 11 మంది అరెస్ట్


వీరిలో ముగ్గురు బ్రోకర్లు, 8 మంది విద్యార్థులు

 సాక్షి, హైదరాబాద్:  వైద్య విద్య పీజీ ఎంట్రన్స్  స్కామ్‌లో  మరో 11 మంది నిందితులను  సీఐడీ  అరెస్ట్‌చేసింది.   వీరిలో ముగ్గురు బ్రోకర్లు ఉండగా, 8 మంది  విద్యార్థులున్నారని సీఐడీ  డీజీ  కృష్ణప్రసాద్  మంగళవారం  తెలిపారు.  అరెస్టయిన వారిలో   బ్రోకర్లు గద్దె రాంబాబు, షకీల్ అహ్మద్, శివప్రసాద్‌లు ఉన్నారు. అలాగే  విద్యార్థులలో కృష్ణ కార్తిక్(ర్యాంకు 31), కాజా నీలహారిక(ర్యాంకు 54), రాధారెడ్డి శ్యామల(ర్యాంకు60), కీర్తీ  చౌదరి(79), లంకా ప్రత్యూష(80), ఫణి శ్రీ (ర్యాంకు 94), భరత్‌చంద్ర (ర్యాంకు 110), షేక్ హుస్సేన్‌బాషా (ర్యాంకు 263)  ఉన్నారు. కాగా  ఇప్పటివరకు 18 మంది బ్రోకర్లు, 23 మంది  విద్యార్థులు  కలిపి  మొత్తం  ఈ స్కామ్‌లో 41 మందిని  అదుపులోకి తీసుకున్నారు.  గుంటూరుకు చెందిన గద్దె రాంబాబు బెంగళూరులోని  షకీల్‌తో కలసి ఈస్కామ్‌లో పాలు పంచుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.

 

 ‘పీజీమెట్’పై 25కల్లా తీర్పు

 పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్ష (పీజీమెట్)ను తిరిగి నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ నెల 25కల్లా తీర్పు వెలువరిస్తానని చెప్పారు. పీజీ వైద్య ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 69ని సవాలు చేస్తూ డాక్టర్ విక్రంరెడ్డి, మరో 90 మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top