'పదో పీఆర్సీ అమలు చేయాలి'


అనంతపురం: ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ 43 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణం అమలు చేయాలని వైఎస్‌ఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.50 లక్షల మంది ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వీటి పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రకటించిన పీఆర్సీని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.



రాజకీయ బదిలీలను రద్దు చేయాలని, బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా ప్రీమియం చెల్లిస్తున్నా వైద్యం అందడం లేదని వాపోయారు. తక్షణం ఆరోగ్య కార్డులు ఇచ్చి అన్ని ఆస్పత్రులలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. రూ.398తో పని చేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయంట్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, పుల్లారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top