'ఎవరేమన్నా... రాజధాని అక్కడే'

'ఎవరేమన్నా... రాజధాని అక్కడే' - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు ఎక్కడ అనే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీలో పుల్లారావు మాట్లాడుతూ... శివరామకృష్ణన్ కమిటీ మరో చోట రాజధాని అని నివేదిక ఇచ్చిన విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయం సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు. నూతన రాజధాని ఏర్పాటుపై విభిన్న ప్రకటనలు చేయొద్దని

పుల్లారావు సహాచర మంత్రులకు హితవు పలికారు. రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూసుకుంటారని పుల్లారావు వెల్లడించారు.



ఏపీ రాజధానిని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య వ్యవసాయ భూములు ఉన్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. నూతన రాజధాని ఏర్పాటుకు మార్టురు - వినుకొండ అత్యంత అనుకూలమని పేర్కొంది. దాంతో ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ లాబీలో కమిటీ నివేదికపై చర్చించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న యనమల మాట్లాడుతూ... వినుకోండ అయితే ఇబ్బందే అన్నారు. దోనకొండ అయితే ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. నివేదిక వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు.



అయితే కమిటీ నివేదికపై గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు ఇప్పటికే విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఏర్పాటవుతుందని ఎప్పటి నుంచో ప్రకటించారు. దీంతో ఆ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు ఆనందంతో ఉన్నారు. మార్టురు - దొనకోండ వద్ద రాజధానికి అనుకూలమంటూ శివరామకృష్ణకు కమిటీ తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అసెంబ్లీ లాబీలో ఏపీ రాజధాని ఏర్పాటుపైనే చర్చ సాగుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top