ఏపీలో బాదుడు మొదలైంది


భూ వినియోగ మార్పిడిపై 10, రిజిస్ట్రేషన్ ఫీజు 5శాతానికి పెంపు



హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. దీంతో భారీ ఎత్తున వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ రంగానికి మార్చనున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంపై భూ వినియోగ మార్పిడి ఫీజును వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భూ వినియోగ మార్పిడి ఫీజు ఐదు శాతం ఉన్నప్పటికీ వసూలు చేయకుండా మినహాయింపులు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆదాయ వనరులు పెంచుకోవడంలో భాగంగా వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ రంగానికి, ఇతర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు వినియోగానికి మార్చితే అందుకు ఎక్కువ మొత్తంలో భూ వినియోగ మార్పిడి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు శాతంగా ఉన్న ఫీజును కూడా పెంచేందుకు ప్రతిపాదనలను రూపొందించాలని తీర్మానించింది.



ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఆదాయ వనరుల సేకరణ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. భూ వినియోగ మార్పిడి ఫీజును పది శాతం వరకు వసూలు చేయాలనే ఆలోచనకు వచ్చారు.  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు శాతానికి పెంచాలని నిర్ణయించారు. భూ కానుకలు, సెటిల్‌మెంట్ డీడ్లుపై ప్రస్తుతం ఒక శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండగా దాన్ని రెండు శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం తయారీ కంపెనీలను ఏర్పాటు చేయాలని, గనుల లీజు లెసైన్సులు ఫీజులు పెంచాలని కూడా నిర్ణయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top