కారును ఢీకొన్నటిప్పర్ : ఒకరి మృతి
టంగుటూరు : ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలం ఓళ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓంగోలుకు చెందిన కాలే శివప్రసాద్ (39) తన కుటుంబ సభ్యులతో పెళ్లి షాపింగ్ కోసం కారులో చెన్నై వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఓళ్లూరు గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో శివప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.