
కథ’ వార్షిక సంకలనాల వరుసలో ‘కథ 2010’ ఇరవయ్ ఒకటవది. ఇందులో పద మూడు కథలు ఉన్నాయి. ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కృషిని సాగిస్తున్న సంగతిని ముందుగా చెప్పుకోవాలి. ‘కథ 90’ వెలువడేనాటికి తెలుగు సాహిత్య వాతావరణంలో కథ కన్నా, వచన కవితదే పై చేయిగా ఉంది. అంతకు ముందు కొన్నేళ్లు నవలలది పై చేయి. ‘90 తరువాత ముఖ్యంగా వీరి ప్రయత్నం, దానికి అనుబంధంగా మరికొందరి ప్రయత్నాల వల్ల కథా ప్రక్రియకు ప్రాచుర్యం వచ్చింది. విరివిగా సంపుటాలు, సంకలనాలు వచ్చాయి. కథకుల సంఖ్య పెరిగింది.
‘కథ’ సంకలనాలలో కనిపించే కథలూ, వాటి కథకులనూ పరిశీలిస్తే సంకలనకర్తల ప్రాధాన్యం అర్థమవుతుంది. కొత్తదనం, ప్రయోగం సంపాదకుల దృష్టిలో అత్యవసరం. ‘కథ 2010’లో మొదటి కథ డాక్టర్ వి. చంద్రశేఖరరావు ‘హెచ్.నరసింహం ఆత్మహత్య’. మొత్తం సంకలనాలలో డాక్టర్ చంద్రశేఖరరావు గారివి పది కథలు ఉన్నాయి. సింహభాగం ఈ రచయితదే. ఇది కూడా పూర్తిగా ఆయన మార్కు కథే. ఓ సందర్భం, ఓ వాతావరణం, ఓ సంఘర్షణ తన రచనలలో చెబుతారాయన. కథగా చెప్పరు. అది ఆయన పద్ధతి. ఈ సంపుటిలో మిగిలిన కథకులకి కూడా వారివారి పద్ధతి వారికి ఉంది. నిజానికి అలాంటి ఏదో పద్ధతి కనపడితే తప్ప సంపాదకులు సాధారణంగా ఎంపిక చేయరు.
ఈ సంకలనాలలో 142 మంది రాసిన 255 కథలు ఉన్నాయి. ఎనభయ్ దశకం వరకు తెలుగు కథలు చదవగానే అవి బాగున్నాయో, లేదో రచయితలకే కాదు, సాధారణ పాఠకులకీ వెంటనే తెలిసేది. ఇప్పటి కథలు అలా కాదు. చదివి జీర్ణించుకోవడానికి సాధారణ పాఠ కులతో పాటు రచయితలూ, విమర్శకులకు కూడా కొంత శోధన, ఓపిక అవసరం. ‘కథ’ సంకలనాలలో రకరకాల ప్రయోగాలు, ధోరణులు , అందుకు ప్రయత్నాలు కనిపిస్తాయి. కొత్తదనాన్ని ఆహ్వానించడం అవసరమే. కానీ దాంతో పాటు ప్రయోగాలు ఎంతవరకు ఫలప్రదమైనాయో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూడడమూ అవసరమే. చాసో, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రా.వి.శాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి కథకులు రాసిన మార్గంలో - అంటే సున్నితంగా, గందరగోళానికి ఆస్కారం లేకుండా తమదైన సృజనాత్మకత చూపించిన సాధారణ పద్ధతిలో రాసిన కథలు, ఇలాంటి సంకలనాలలో అరుదుగా కనిపించడం సాధారణ పాఠకులకు కొంతవరకు లోటే. కథల ఎంపికలో కొంత అసంతృప్తి ఎదురవుతున్నదని ఈ సంకలనాలలోనూ చెప్పారు సంపాదకులు. పొలిటికల్ ఫిక్షన్నే కాక తదితర జనసామాన్యం ఇష్టపడే కథలు కూడా చేర్చవలసిన అవసరం ఉందేమో వారు ఆలోచించాలి.
కొత్త సంకలనంలో తల్లావఝల పతంజలి శాస్త్రి, వాడ్రేవు చినవీరభద్రుడు, మహమ్మదు ఖదీరుబాబు, నరేంద్ర వంటి వారి చేయి తిరిగిన రచయితల కథలతో పాటు, భగవంతం, పసుపులేటి గీత, ఆళోక్కుమార్ల నవీన కథలూ ఉన్నాయి.
- వి.ఆర్.